Wednesday, May 6, 2020

టీకా.. అప్పుడు మాకొద్దు

టీకా.. అప్పుడు మాకొద్దు!
4 May, 2020


తొలినాళ్లలో మశూచి టీకాను వద్దన్న ప్రజలు
మూఢనమ్మకాలతో వాడేందుకు వెనకడుగు..
చాన్నాళ్ల తర్వాత ఆ టీకాకు సరేనన్న జనం
కరోనా టీకా కోసం ప్రపంచం ఎదురుచూపు
ప్రయోగాలపై మానవాళి కొండంత ఆశ

కరోనా మహమ్మారిని నియంత్రించే దారిలేక, నివారించే ఔషధం దొరక్క మానవాళి అల్లకల్లోలమవుతోంది.  దీని అంతుచూసే టీకా ఎప్పుడొస్తుందా అని కోట్ల కళ్లతో ప్రపంచం ఎదురుచూస్తోంది. అయితే,  తొలి టీకా వచ్చినప్పుడు జనమంతా వద్దంటే వద్దన్నారు. ఆ విషయం మీకు తెలుసా? మశూచి పేరు గుర్తుంది కదా. మహమ్మారి అన్నమాట పర్యాయపదంగా మారింది దీనికే (దీనికంటే ముందు మహమ్మారులున్నా జనానికి గుర్తున్న తొలిపేరు ఇదే).

16వ శతాబ్దంలో దీని ప్రభావం ముమ్మరంగా ఉండేది. ఇప్పుడు కరోనా తరహాలో యావత్తు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించింది. ఏటా 30లక్షలకుపైగా జనం దీనికి బలయ్యేవారట. అం తటి ప్రమాదకర అంటురోగమిది. చనిపోయేవాళ్లు పోను, దాని నుంచి బతికి బయటపడ్డవారి ముఖం స్ఫోటకం మచ్చలతో వికారం గా మారేది. అసలు ఈ వ్యాధి ఏంటో, ఎలా వస్తుందో తెలుసుకునే పరిజ్ఞానం లేక జనం దానికి బలవటం సాధారణంగా మారింది. 1796లో దానికి టీకా అందుబాటులోకి వచ్చిం ది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఏటా పొట్టనపెట్టుకునే మహమ్మారిని నియంత్రించే టీకా వచ్చినా దాన్ని వినియోగించేందుకు జనం ముందుకు రాలేదు. అప్పటి వరకు అంటురోగాలకు టీకా అంటే ఎరగని ప్రపంచానికి పరిచయమైన తొలి వ్యాక్సిన్‌ అదే. కానీ జనం దాన్ని ముక్తకంఠంతో తిరస్కరించారు.

నాడు వద్దంటే వద్దన్నారు..
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచికి విరుగుడు టీకాను రూపొందించారు. మశూచిని మాయం చేయాలంటే ఏం చేయాలనే విషయంలో కొన్నేళ్లపాటు సాగిన ఆయన అధ్యయనం చివకు సత్ఫలితాన్నిచ్చింది. మశూచి ప్రబలిన సమయంలో కౌపాక్స్‌ వైరస్‌ కూడా ప్రభావం చూపింది. శరీరంపై పెద్దపెద్ద పుండ్లు పడేవి. దీన్ని నిశితంగా గమనించిన డాక్టర్‌ జెన్నర్‌ ఓ విషయాన్ని గుర్తించారు. కౌపాక్స్‌ సోకిన వారికి మశూచి రావటం లేదని నిర్ధారించుకున్నారు. అంటే మనిషి శరీరంలోకి కౌపాక్స్‌ కారకాన్ని ప్రవేశపెడితే మశూచి క్రిమి సోకదన్నది ఆయన భావన. ప్రయోగాలు చేసి చివరకు సారా నెల్‌మెస్‌ అనే మహిళ శరీరంలోని కౌపాక్స్‌ పుండు నుంచి కొంతభాగం సేకరించి ఎనిమిదేళ్ల జేమ్స్‌ ఫిప్స్‌ అనే బాలుడి శరీరంలోకి సూది ద్వారా ప్రవేశపెట్టారు.

దీంతో ఆ బాలుడికి కౌపాక్స్‌ సోకింది. నెలన్నర తర్వాత మశూచి రోగి నుంచి తీసిన కణాన్ని ప్రవేశపెట్టారు. కానీ మశూచీ లక్షణాలు కనిపించలేదు. దీంతో తన ప్రయోగం విజయవంతమైందని ప్రకటించి దాని ఆధారంగా టీకాను రూపొందించారు. ప్రపంచమొత్తం దీన్ని వాడి ఆ మహమ్మారిని దూరం చేసుకుంటుందన్న ఆయన ఆశ అనతికాలంలోనే విఫలమైంది. ఆ వ్యాక్సిన్‌ వాడేందుకు జనం వెనకడుగు వేశారు. మరొకరి శరీరంలోని మాంసం కణాలను తమ శరీరంలోకి రావటాన్ని జనం వ్యతిరేకించారు. కొందరు పనిగట్టుకుని ఆ ప్రయోగాన్ని అడ్డుకున్నారు. కొంతమంది మాత్రమే ఆ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్నవారు మశూచి బారినపడని తీరును చూసి కూడా జనం దానికి దూరంగానే ఉండిపోయారు.

తప్పనిసరి చేసినా..
క్రమంగా మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువవుతుండటంతో బ్రిటిష్‌ పాలకులు 1840లో చట్టం చేశారు. ప్రజలు నిరభ్యంతరంగా ఆ టీకా వేయించుకోవాలని పేర్కొన్నారు. అది కొంతమేర పనిచేసినా అనుకున్నంత సానుకూలత రాలేదు. దీంతో 1853లో ఆ టీకాను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో బ్రిటన్‌లో ఏటా 66% మంది టీకా వేయించుకోవటం ప్రారంభించారు. అప్పటికే యూరప్, అమెరికా ఖండాల్లోని దేశాలు దీన్ని వాడటం ప్రారంభించాయి. క్రమంగా ఆయా దేశాల్లో మశూచి ప్రభావం తగ్గింది. కానీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జనంలో మార్పు రాలేదు. ఇంతలో 1898లో బ్రిటన్‌లో తప్పనిసరి చట్టానికి కొంతమంది పనిగట్టుకుని సవరణ చేయించారు. వీరంతా ఆ టీకాను వ్యతిరేకించేవారు. ఫలితంగా టీకా వేయించుకునేవారి సంఖ్య 39శాతానికి తగ్గింది. దీంతో మళ్లీ అక్కడ వ్యాధి విజృంభించింది.

షాజహాన్‌ గుబురు గడ్డం వెనక ‘మశూచి మచ్చలు’ 
మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ గడ్డం వెనక మశూచీ కథ దాగి ఉంది. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు మశూచి బారినపడ్డారు. చివరకు ఆయనెంతో ఇష్టపడే కూతురు కూడా దీనికే బలైంది. ఆయన కోలుకున్నా.. మొహం దిగువన బాగా మచ్చలుపడ్డాయి. అప్పటివరకు నాజూకు గెడ్డంతో ఉన్న షాజహాన్‌.. ఆ మచ్చలు కనిపించకుండా ఉండేందుకు దాన్ని గుబురుగా పెంచటం ప్రారంభించారట.

మనోళ్లదీ అదే మాట..
మశూచితో దేశంలో సాలీనా 2లక్షల మంది సగుటున చనిపోయేవారు. మూఢనమ్మకాల ప్రభావంతో జనం మశూచి టీకాను వ్యతిరేకించారు. ఆ సమయంలో యూకేలోని స్కాట్లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో లక్ష మంది టీకాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం మన దేశంపై మరింత ప్రభావం చూపింది. స్థానిక బ్రిటిష్‌ పాలకులు టీకా అందుబాటులో ఉంచినా, జనంలో మార్పు కోసం పెద్దగా యత్నించలేదు. ఇది మహమ్మారి విజృంభణకు కారణమైంది. కొన్నిచోట్ల బలవంతంగా టీకా ఇచ్చినా, దానికి విరుగుడుగా మూఢనమ్మకంతో జనం పేడ రాసేవారు. మీజిల్స్, కోరింత దగ్గులాంటి టీకాల విషయంలోనూ ఇలాగే చేసేవారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకాపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ జోక్యం చేసుకుంది.

అదే సమయంలో ఆ సంస్థ పోత్సాహంతో వ్యాక్సిన్‌ కోసం మరిన్ని ప్రయోగాలు జరిగాయి. నేరుగా వైరస్‌ నుంచే వ్యాక్సిన్‌ రూపొందించే మరో విధానం సక్సెస్‌ అయి కొత్తరకం వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినా జనంలో వ్యతిరేకత తగ్గలేదు. చివరకు 1967లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆ వ్యాక్సిన్‌ కచ్చితంగా వేసేలా పాఠశాల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇది సత్ఫలితాలనిచ్చింది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం తగ్గింది. చివరకు 1980లో ఆ మహమ్మారిని నిర్మూలించినట్టు ప్రకటించింది.

మరిప్పుడు.. వెంటనే కావాలి..
ప్రస్తుత సమయానికొస్తే.. కరోనా  ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియక ఇప్పుడు ప్రపంచం యావత్తూ కరోనాను తలచుకుని హడలిపోతోంది. టీకా, టీకా అంటూ కలవరించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఫలితాలనిస్తున్న ప్రయోగాలు..
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–భారత్‌కు చెందిన సీరమ్‌ కంపెనీ సంయుక్తంగా చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయట.. త్వరలోనే టీకా వస్తుందట అనే వార్తలు ఒక్క క్షణం కరోనాను జయించినంత సంతోషం కలిగిం చాయి. ఆస్ట్రేలియా వైద్యుల ప్రయత్నాలు సానుకూలం గా ఉన్నాయని, జర్మనీ సంస్థ మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టిందని, అమెరికాలో కూడా ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయని.. ఇలాంటి వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తుండటంతో క్రమంగా జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరో ఆరేడు నెలల్లో వ్యాక్సిన్‌ రావటం ఖాయమన్న భరోసా దక్కి, అప్పటి వరకు ఎలాగో కరోనాను కాచుకోవాలని సంకల్పించి అడుగులేస్తున్నారు. కరోనాను జయించే బ్రహ్మాస్త్రం ఇప్పుడా వ్యాక్సినే. ఏ దేశం అని కాదు, ప్రపం చంలో ఏ మూల తయారైనా సరే ఆ టీకాను అర్జంటుగా వేయించుకోవాల్సిందే అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన. మశూచి విషయంలో నాడు టీకా వద్దన్న జనం ఇప్పుడెందుకు బలంగా కోరుకుం టున్నారంటే.. ప్రసార మాధ్యమాల విషయంలో విప్లవాత్మక అభివృద్ధే కారణం. కరోనా మృత్యుకేళి ఎలా ఉందో నిత్యం టీవీలు, పత్రి కలు కళ్లకు కడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్న తీరును కళ్లారా చూసి జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో భయం పెరిగింది. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.