Saturday, May 30, 2020

కరోనా వేళ భారత భూభాగాల్లోకి డ్రాగన్‌ సేనలు



వేళ్ల లెక్కలు మరిచిన చైనా..!  
 కరోనా వేళ భారత భూభాగాల్లోకి డ్రాగన్‌ సేనలు
 నిలువరిస్తున్న భారత దళాలు..


భారత్‌ చైనా మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకానపడుతోంది. మరో డోక్లాంగా మారే పరిస్థితులు తలెత్తాయి. 1967 తర్వాత ఒక్క తూటా కూడా పేలని భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంట భారీ బలగాలతో ఎదురెదురుగా నిలిచాయి. కరోనా వైరస్‌ ఇరు దేశాల్లో విజృంభించిన సమయంలో కూడా చైనా సైనికులు పొరుగుదేశాల భూభాగాల్లోకి చొరబడటం మానలేదు. ముఖ్యంగా పాంగాంగ్‌ సరస్సు వద్ద,  గాల్వన్‌ లోయలో, సిక్కింలోని నాకుల వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

పాంగాంగ్‌ వద్ద వివాదం ఇదీ..
పాంగాంగ్‌  సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60శాతం టిబెట్‌ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా  దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు  ‘ఫింగర్స్‌’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ ‘ఫింగర్‌ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్‌ సైన్యాన్ని ఫింగర్‌2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్‌ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు పెట్రోలింగ్‌ చేస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్‌ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో చైనా ఎల్‌ఎక్స్‌ రకం బోట్లను తీసుకొచ్చింది.  

వీటి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఏమిటీ..?
ఇవి బంజరు పర్వతాలు మాత్రమే. చైనా వీటిపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వెనుక చాలా వ్యూహం ఉంది. భారత్‌ ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడకు శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. 

కార్గిల్‌ యుద్ధ సమయంలోనే..
కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఫింగర్‌ వద్ద రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫింగర్‌ 2-3 మధ్య ఈ నిర్మాణం జరుగుతోంది. భారత్‌తో పోలిస్తే చైనా దళాలు ఈ ప్రదేశానికి వేగంగా చేరుకొనే అవకాశాలను ఇది కల్పిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇక్కడ భారత పెట్రోలింగ్‌ను అడ్డుకొనేందుకు చైనా భారీ సంఖ్యలో దళాలను తరలించింది. 

గాల్వన్‌ లోయలో కూడా..
1962 అక్టోబర్‌ 20న చైనా సైన్యం దాడిని ప్రారంభించిన ప్రదేశాల్లో గాల్వన్‌ లోయ కూడా ఒకటి. భారత్‌ 2017లో డోక్లాం వద్ద చైనా సైన్యాన్ని ఎదురొడ్డి నిలిచింది. అప్పట్లో సైన్యాన్ని తరలించడంలో ఏర్పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. వాస్తవాధీన రేఖకు దాదాపు 10 కిలోమీటర్ల లోపలే డర్బుకు-ష్యాక్‌-డీబీవో మధ్య రహదారి నిర్మాణం చేపట్టారు. ఇది దళాల కదలికలకు ఉపయోగపడుతుంది. తాజాగా చైనా లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌ చైనా మధ్య వివాదానికి ఇది కూడా కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణానికి చైనా అంగీకరించడంలేదు. గాల్వన్‌ లోయకు సమీపంలోని భారత్‌కు చెందిన దౌలత్‌బేగ్‌ ఎయిర్‌స్ట్రిప్‌ ఉంది. దీనిపై పెద్ద విమానాలను కూడా ల్యాండ్‌ చేసుకోవచ్చు. తాజా చైనా సైన్యం గాల్వన్‌ లోయలోకి భారీ సంఖ్యలో సైనికులను తరలించింది. గాల్వాన్‌ లోయలో గత రెండు వారాల్లో దాదాపు 100 వరకూ గుడారాలు వేసినట్లు, బంకర్ల నిర్మాణం కోసం భారీ సామగ్రిని రప్పించినట్లు తెలుస్తోంది. గాల్వన్‌ వద్ద భారత్‌ కొంత బలంగానే ఉంది.